Sujana Chowdary: ఎన్టీఆర్ ఫోటో ఉన్న వాహనంపై నామినేషన్ వేసేందుకు వెళ్లిన సుజనా చౌదరి.. కూటమిదే గెలుపని ధీమా

  • విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ తరపున సుజనా పోటీ
  • సుజనా వెంట వంగవీటి రాధ, బుద్దా, కొనకళ్ల తదితర నేతలు
  • వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారన్న సుజనా
Sujana Chowdary leaves to file nomination

ఏపీ, తెలంగాణల్లో నామినేషన్ల పర్వం ప్రారంభమయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సుజనా చౌదరి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా బయల్దేరారు. అంతకు ముందు చిట్టినగర్ లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయల్దేరారు. కూటమికి చెందిన వేలాది మంది నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ప్రచార రథంపై దివంగత ఎన్టీఆర్ ఫొటోను ఉంచారు. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో ర్యాలీ ముందుకు సాగుతోంది. సుజనా వెంట వంగవీటి రాధ, బుద్దా వెంకన్న, కొనకళ్ల నారాయణ, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీను తదితర నేతలు ఉన్నారు. 

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ... ఏపీలో కూటమి ఘన విజయం సాధించబోతోందని చెప్పారు. విజయవాడ వెస్ట్ లో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాన్ని తిరోగమనం పట్టించారని మండిపడ్డారు. ఈ అరాచక పాలనకు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ప్రజల నుంచి తనకు మంచి స్పందన వస్తోందని... అభివృద్ధి అంటే ఏమిటో, ఎలా ఉంటుందో తాను చేసి చూపుతానని చెప్పారు. ఏపీ రాజకీయ రాజధాని విజయవాడను రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి రాజధానిగా చేసి చూపుతామని అన్నారు.

More Telugu News